రజినీ పంచ్ కు కరుణానిధి రివర్స్ పంచ్…!!

దివంగత తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి ఏం చేసినా ఓ సెన్సేషనే.. ఆయన ఎక్కడ మాట్లాడినా అందులో పంచ్ పడాల్సిందే. తనను పరోక్షంగా విమర్శించిన వారికి సైతం వేదికలపైనే ఎవరికి తగలాలో వారికి తగిలేలా పంచ్ డైలాగులు వదలడంలో ఆయన దిట్ట. అలా ఒక వేదికపై సూపర్ స్టార్ రజినీకాంత్ కు కరుణానిధి సీరియస్ పంచ్ వేశారట. చెన్నైలో జరిగిన ఒక సినిమా కార్యక్రమానికి కరుణానిధి హాజరైనప్పుడు ఓ సంఘటనను ఇందుకు ఉదాహరణగా చెబుతారు రజినీకాంత్.
కార్యక్రమంలో మొదటగా మాట్లాడిన రజనీకాంత్ సమకాలీన రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ ఒక మాటన్నారట. రాజకీయ నాయకులంటే నిప్పు లాంటివారు.. వారు ఎంత సన్నిహితులైనా సరే, ఆ నిప్పుల సెగ తగలకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ కరుణానిధిని ఉద్దేశించి ఓ పంచ్ డైలాగ్ వేశారట. అది విన్న కరుణానిధి అది తనను ఉద్దేశించి మాట్లాడుతున్నారని ఆయన గ్రహించారట. తన వంతు వచ్చే వరకు నవ్వి మౌనంగా కూర్చున్నారట.
ఇక ఆ తర్వాత తన వంతు రాగానే వేదికపై మాట్లాడుతూ, సందర్భానుసారంగా రజినీనీ ఉద్దేశించి పంచ్ వేశారట. తమ్ముడూ నేను అవినీతికి మాత్రమే నిప్పులాంటోడిని.. కానీ సేవలో ప్రజల కాలి చెప్పులాంటోడిని అంటూ వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వుల పువ్వులు పూశాయట. ఈ ఒక్క మాటతో ప్రజలకు తాను ఎంత గౌరవిస్తాననేది చెప్పేశారట కరుణానిధి. అందుకేనేమో ఆయన్ని మాటల మాంత్రికుడు అంటుంటారు చాలామంది.
