బోర్లా పడి బొక్కలు విరిగినా.. బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదు !

బోర్లా పడి బొక్కలు విరిగినా.. బీఆర్ఎస్ కు ఇంకా బుద్దిరాలేదని, నెల రోజులు గడవక ముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారుని  సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఇందిరా భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ .. బీఆర్ఎస్ తీరుపై ఫైర్ అయ్యారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్ ఎస్ దోచుకుంది.  ఆ పార్టీ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తీసుకుంటామని  హామీ ఇచ్చారు.

బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుందని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. అందుకే ఆయన కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారని అన్నారు.  ఆనాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు  ఏం చేశారని ప్రశ్నించారు. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నాడు. కాళేశ్వరం అవినీతిపై మేం జ్యుడీషియల్ విచారణ చేసి తీరుతాం. బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు.. ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు… పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారని విమర్శించారు.

టార్గెట్ 17 : ఇక టార్గెట్ 17 పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్ సభ స్థానాలు గెలిపించుకోవాలన్నారు. ఈ నెల 8న 5జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్షిస్తానని.. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇంఛార్జ్ లతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. 20 తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానని చెప్పారు.