గణేశ్‌ ఉత్సవాలపై హైకోర్టు ఆంక్షలు

గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జనంపై రాష్ట్ర తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. గణేశ్‌, దుర్గాదేవి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలో న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఇటీవల సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. తాజాగా తీర్పును వెలువరించింది.

హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్‌ వైపు నుంచి నిమజ్జనం చేయొద్దని.. పీవీ మార్గ్‌, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు రోడ్డు తదితర ప్రాంతాల్లో చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. హుస్సేన్‌సాగర్‌లో పూర్తిగా కాకుండా ప్రత్యేకంగా రబ్బర్‌ డ్యాం తరహా ఏర్పాట్లు చేసి నిమజ్జనం చేయాలని ఆదేశించింది. నిమజ్జనం తర్వాత అక్కడి వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి ధ్వని కాలుష్యం రాకుండా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది.