రౌడీ సినిమా కోసం వందకోట్లు

‘ఎక్కడ స్టార్ట్ అయ్యాం కాదన్నయ్యా.. ఎక్కడికి వెళ్లామన్నదే ముఖ్యం’ అంటున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. విజయ్ కి బ్రేక్ ఇచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమా కేవలం రూ. 60 లక్షలతో తెరకెక్కింది. ప్రమోషన్ ఖర్చులతో కలుపుకున్నా.. రూ. 1.2 కోట్లు దాటలేదు. అయితే ఇప్పుడు విజయ్ కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. అదికూడా లైగర్ అట్టర్ ప్లాప్ తర్వాత ధైర్యం చేయడం నిజంగా గ్రేట్.

ప్రస్తుతం విజయ్ మూడు సినిమాలు ఖరారు చేశారు. సుకుమార్ తో ఓ సినిమా ఉండనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది. అయితే ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాతే విజయ్ తో సుక్కు సినిమా ఉండనుంది. ఈలోపు రౌడీ హీరో మరో రెండు సినిమాలు పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇందులో ఒకటి జర్సీ దర్శకుడు గౌతమ్ తిన్నమూరితో కాగా.. రెండో సినిమా గీత గోవిందం డైరెక్టర్ పరుశరాం తో ఉండనుంది.

ఈ రెండింటిలో గౌతమ్ సినిమా ముందుగా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన పరశురామ్ సినిమా ముందుగా రాబోతుంది. జట్ స్పీడ్ తో సినిమా ని ఫినిష్ చేస్తానని పరశురామ్ మాట ఇవ్వడంతో.. ఆ సినిమా పనులు షురూ అయ్యాయి. ఇక గౌతమ్ తిన్నమూరితో విజయ్ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండనుందట. ఈ సినిమా కోసం నిర్మాతలు రూ. 100 కోట్ల బడ్జెట్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత నాగ వంశీ విజయ్ సినిమా కోసం వందకోట్ల కు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో.. అందరూ.. రౌడీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.