ఫైల్స్ క్లియ‌ర్‌గా ఉండాలి.. లేదంటే జీహెచ్ఎంసీ, హెచ్ ఎండీఏ అధికారులు ఇంటికి పోతారు !

 జీహెచ్ఎంసీ, హెచ్ ఎండీఏ ప‌రిధిలో బిల్డింగ్ ప‌ర్మిష‌న్స్ ఫైల్స్ క్లియ‌ర్‌గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హెచ్ఎండీఏ  కార్యాల‌యంలో వాట‌ర్ వ‌ర్క్స్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, జీహెచ్ఎంసీపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష‌ నిర్వహించారు.  చాలా బిల్డింగ్స్ అనుమ‌తుల‌కు సంబంధించిన ఫైల్స్ క‌నిపించ‌డం లేదు. ఆన్‌లైన్ లేకుండా ఇష్ట‌రీతిగా ప‌ర్మిష‌న్లు ఇచ్చారు. 15 రోజుల్లో హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జ‌రుగుతాయి. ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించిన అధికారులు ఇంటికిపోతారని సీఎం హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో లేకుండా ఇచ్చిన అనుమ‌తుల జాబితా త‌యారు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. హెచ్ ఎండీఏ వెబ్‌సైట్ నుంచి చెరువుల ఆన్‌లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతోందని ప్రశ్నించారు. 3,500 చెరువుల డేటా ఆన్‌లైన్‌లో  ఉండాల్సిందేనన్నారు. చెరువులు ఆక్ర‌మ‌ణ‌కు గురికాకుండా వాటి వ‌ద్ద త‌క్ష‌ణ‌మే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 

హైద‌రాబాద్ న‌గ‌రంలో పిల్ల‌ల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని పుర‌పాల‌క ప‌రిపాల‌న శాఖ‌ అధికారులని సీఎం రేవంత్ ఆదేశించారు. కొత్త‌గా ఏర్ప‌డిన 85 మున్సిపాలిటీల్లో క‌మిష‌న‌ర్లు లేక‌పోవ‌డంపై సీఎం రేవంత్ రెడ్డి ఆశ్చ‌ర్యం వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. గ్రూప్ 1 అధికారులు క‌మిష‌న‌ర్‌లుగా ఉండేలా చూడాల‌ని ఆదేశించారు. కొత్త కార్పొరేష‌న్ల‌కు ఐఏఎస్‌ల‌ను క‌మిష‌న‌ర్‌లుగా నియ‌మించాల‌ని సూచ‌న‌ చేశారు.  మున్సిపాలిటీల్లో ప‌ని చేసే మున్సిప‌ల్ వ‌ర్క‌ర్ల‌కు ప్ర‌మాద బీమా క‌ల్పించ‌డంపై అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.  జీహెచ్ ఎంసీలో వ‌య‌స్సుపైబ‌డిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ స‌భ్యుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని,  ఆస్తి ప‌న్ను మ‌దింపు కోసం డ్రోన్ కెమెరాల‌ను ఉప‌యోగించేందుకు అధ్య‌య‌నం చేయాల‌న్నారు. * హైద‌రాబాద్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో మ‌ల్టీ లెవ‌ల్ పార్కింగ్ ఏర్పాటు చేయాల‌న్నారు.

 హైద‌రాబాద్‌లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ త‌ర‌హాలో వీడియో ప్ర‌క‌ట‌న‌ల బోర్డు ఏర్పాటు చేయాల‌ని సూచ‌న‌ చేశారు. మ‌ల్టీ యుటిలిటీ ట‌వ‌ర్స్‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశాలు చేసారు.  హైద‌రాబాద్ న‌గ‌రానికి మంచి నీటి కొర‌త లేకుండా చూడాల‌ని ఆదేశాలు చేశారు. స్థానిక చెరువుల‌ను స్టోరేజీ ట్యాంకులుగా ఉప‌యోగించుకోవాల‌ని అన్నారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్‌, కొండ‌పోచ‌మ్మ, రంగ‌నాయ‌క సాగ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు తాగు నీటి స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్ర‌ణాళిక ర‌చించాల‌ని ఆదేశించారు.  ఔట‌ర్ రింగు రోడ్డు బ‌య‌ట ఉన్న చెరువుల‌ను క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించాల‌ని.. వ‌చ్చే 50 ఏళ్ల తాగు నీటి అవ‌స‌రాల కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చించాల‌ని అధికారుల‌కు సూచించారు.