ప్రధాని సూచనలతో బరిలోకి దిగిపోయారు


ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుక్రవారం దేశంలోని 40 మంది ప్రముఖ క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కరోనా పరిస్థితిపై చర్చించారు. క్రీడాకారులంతా వారి సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా కొవిడ్‌-19కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులు బరిలోకి దిగిపోయారు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత మనం తీసుకునే జాగ్రత్తలు చాలా ముఖ్యం అంటూ మెసేజ్ ఇచ్చారు.


తాజాగా తెలుగు తేజం పీవీ సింధు ..కరోనాపై వీడియో సందేశాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ”బ్యాడ్మింటన్‌ కోర్టులోనే ఆడాలి.. అప్పుడే గెలుస్తాం. కరోనాతో ఫైట్‌ చేయాలంటే మనం ఇంట్లోనే ఉండాలి. భౌతికదూరం పాటిస్తేనే కొవిడ్‌-19పై విజయం సాధించగలం. మనకు సహాయం అందించడానికి 104 హెల్ప్‌లైన్‌ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ సూచనలు పాటిద్దాం. ఇంట్లోనే ఉందాం.. కరోనాను కలిసి ఎదుర్కొందాం” అని సింధు పిలుపునిచ్చారు.